ఏ క్రిమినల్ కేసులోనైనా సరే ఒక వ్యక్తికి శిక్ష పడాలంటే కోర్టుకు సాక్ష్యం ఆధారం చాలా కీలకం. హత్య జరిగేటప్పుడు కానీ, హత్య జరిగిన తరువాత గానీ ఆ పరిస్థితులను చూసిన సాక్ష్యులు ఎవరైనా ఉంటే వారు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యం హత్య జరిగిన పరిస్థితులకు సరిపోవాలి. ఒక వేళ సాక్షి ఉద్దేశ్యపూర్వకంగా కూడా నేరస్థుడిని తప్పించడానికి తప్పుడు సాక్ష్యం చెప్పవచ్చు. సాక్ష్యు లందరినీ పరిశీలించిన తర్వాత వారు చెప్తున్న దానికి ఆధారాలు ఎంతమేరకు ఉన్నాయి అని కోర్టు పరిశీలిస్తుంది. సాక్ష్యం, ఆధారాలను సమర్పించాల్సిన బాధ్యత పోలీసులదే. ఒక వేళ పోలీసుల దర్యాప్తు తీరు బాగోలేకుంటే కోర్టు తప్పుపట్టి వారిపైన ఒత్తిడి తెస్తుంది. అయితే అభియోగాలు మోపినంతమాత్రన నేరం చేసినట్లు కాదు. సాక్ష్యాధారాలు సరిగ్గా ఉంటేనే ఎవరికైనా శిక్ష పడుతుంది. పోలీసులు సరైన సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టకపోతే హత్య చేసిన వారు కూడా నిర్ధోషులుగా విడుదల అవుతారు.